న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET UG 2026) పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జైపూర్కు చెందిన ముగ్గురితో పాటు గురుగ్రామ్, నాసిక్ ప్రాంతాల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డబ్బులిస్తే చాలు.. “గెస్ పేపర్” రెడీ!
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడుతున్నాయి. పరీక్షకు ముందే “గెస్ పేపర్” పేరుతో ఒరిజినల్ ప్రశ్నపత్రాలను కొందరు విద్యార్థులకు భారీ ధరలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయల కోసం రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

రోడ్డున పడ్డ విద్యార్థుల భవిష్యత్తు..
“ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి చదివాం.. చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేదు” అంటూ విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి చాలా గోరంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. కోచింగ్ కోసం అప్పులు చేసి లక్షలు ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలన్నా, దూర ప్రాంతాలకు ప్రయాణించాలన్నా ఆర్థికంగా భారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెన్షన్లో పేరెంట్స్.. రీ-ఎగ్జామ్ ఎప్పుడు?
ఒకపక్క పిల్లలు ఒత్తిడిలో ఉంటే, మరోపక్క తల్లిదండ్రులు భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ లీక్ ముఠా మూలాలు ఎక్కడ ఉన్నాయి? అసలు పేపర్ బయటకు ఎలా వచ్చింది? అనే కోణంలో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-ఎగ్జామ్ తేదీలపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోంది.








